బెంగళూర్ : కర్నాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు బీఎస్ యడ్యూరప్ప ప్రకటించడంతో సీఎం పదవి కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. గత కొద్దినెలలుగా సీఎం పదవి తమకు కేటాయించాలని పంచమశాలి లింగాయత్లు డిమాండ్ చేస్తుండటంతో ఈ వర్గానికి చెందిన బీజేపీ నేతలు బసవనగౌడ రామనగౌడ పాటిల్, అరవింద్ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్హ నిరానీ సహా పలువురు నేతలు అత్యున్నత పదవి ఆశిస్తున్నారు.
నిరానీ ఆదివారం ఢిల్లీ వెళ్లడంతో సీఎం పీఠం ఆయనకు దక్కనుందని ప్రచారం సాగినా, ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని నిరానీ అనుచరులు పేర్కొన్నారు. ఇక కర్నాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేరు కూడా ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తోంది. మరోవైపు గౌడ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తే మాజీ కేంద్ర మంత్రి డీవీ సదానంద గౌడ, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవిలను అదృష్టం వరిస్తుందని భావిస్తున్నారు.
గౌడ వర్గానికి చెందిన ప్రముఖ నేతలు ఆర్ అశోక్, సీఎన్ అశ్వద్ధనారాయణన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కర్నాటక సీఎం పదవి దళితులకు కట్టబెట్టాలనే డిమాండ్కు హైకమాండ్ తలొగ్గితే డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, బీ శ్రీరాములు వంటి నేతలు కీలక పదవిని చేపడతారని భావిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా కర్నాటక సీఎం రేసులో పరిశీలనలో ఉందని పార్టీ వర్డాలు పేర్కొన్నాయి.