Chandrayaan-3 | న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాళ ఆ ప్రాజెక్టులో భాగమైన కీలక ఘట్టం చోటుచేసుకున్నది. చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ సక్సెస్ఫుల్గా విడిపోయింది. అయితే విడిపోయిన ల్యాండర్ విక్రమ్.. ఈనెల 23, లేదా 24వ తేదీన చంద్రుడి ఉపరితలంపై దిగనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ వేరైనట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. దీంతో చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఓ కీలక ఘట్టం ముగిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో తేలిపోయారు. స్పేస్క్రాఫ్ట్ నుంచి విక్రమ్ విడిపోయిన నేపథ్యంలో ఇవాళ ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని పోస్టు చేసింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ల్యాండర్ విక్రమ్.. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువకానున్నట్లు వెల్లడించింది.
Chandrayaan-3 Mission:
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct
— ISRO (@isro) August 17, 2023
ల్యాండర్ మాడ్యూల్ వేరు అయిన అనంతరం అతి కీలకమైన పరిణామం చోటుచేసుకోనున్నది. స్పేస్క్రాఫ్ట్ వేగాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనున్నది. అనంతరం స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడికి అతి దగ్గరి ప్రదేశమైన పెరిలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 30 కి.మీ దూరం), అపోలూన్ (చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ దూరం) కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అనంతరం అడ్డంగా ఉన్న స్పేస్క్రాఫ్ట్ను నిలువుగా మార్చే ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత ఇదే కక్ష్య నుంచి ఆగస్టు 23న సాఫ్ట్ ల్యాండింగ్ను చేయనున్నారు. ఆగస్టు 1న భూమి-చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన స్పేస్క్రాఫ్ట్ ఆగస్టు 5న లూనార్ ఆర్బిట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఆగస్టు 6, 9, 14, 16న కక్ష్య తగ్గింపు ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత ల్యాండర్ మాడ్యూల్ సొంత పరిజ్ఞానంతో ముందుకు వెళ్తుందని చంద్రయాన్-1 ప్రాజెక్టు డైరెక్టర్గా పని చేసిన డా. ఎం అన్నాదురై తెలిపారు. ‘ల్యాండర్ మాడ్యూల్లో నాలుగు ప్రధాన థ్రస్టర్లు ఉంటాయి. విడిపోయిన అనంతరం మొదటగా అందులో ఉండే థ్రస్టర్లు, సెన్సార్లను పరీక్షించాల్సిన అవసరం ఉంది. సొంత పరిజ్ఞానంతో 100x 30 కి.మీ కక్ష్యలోకి ల్యాండర్ చేరుకుంటుంది. ల్యాండర్ స్వయం ప్రతిపత్తితో పని చేస్తుంది. సాఫ్ట్ల్యాండింగ్ అయ్యేందుకు వీలుగా ల్యాండర్కు కమాండ్స్, సీక్వెన్స్, ఫెయిల్యూర్ మోడ్ ఐడెంటిఫికేషన్ తదితర అన్నింటిని అందులో ప్రొగ్రామ్ చేశారు. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న తెల్లవారుజామున సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.
చంద్రయాన్-3 చివరి లూనార్ కక్ష్య తగ్గింపు విజయవంతం అవడంపై ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగం సమయంలో ఆయన ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి ఉపరితలాన్ని తాకే గొప్ప క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని శివన్ పేర్కొన్నారు. గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2 కూడా ఈ ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. గతంలో ఎదుర్కొన్న వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. చంద్రయాన్-3 కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు.