న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్యాదవ్ చిన్న కొడుకు, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నేత తేజస్వీయాదవ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో నిశ్చితార్థం జరుగనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో వేడుక జరిగే అవకాశం ఉండగా.. ఢిల్లీలోని లాలూ నివాసం వద్ద సందడి నెలకొన్నది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి కుటుంబం పాటు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి నివాసానికి చేరుకున్నారు.
తేజస్వీయాదవ్ నిశ్చితార్థం చేసుకోబోయే అమ్మాయి తన స్నేహితురాలేనని, ఇద్దరి కులాలు సైతం వేర్వేరని సమాచారం. అయితే, లాలూ ప్రసాద్యాదవ్ కుటుంబం అధికారికంగా వివాహానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది బిహార్లో జరిగిన ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి 110 స్థానాల్లో విజయం సాధించగా.. 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. పార్టీ అత్యధిక స్థానాలు గెలువడంతో తేజస్వీ కీలకపాత్ర పోషించారు.