ధర్మశాల: దలైలామా సెక్యూర్టీలో గత 12 ఏళ్లుగా ఉన్న జాగిలం డోకోను అమ్మేశారు. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు నిర్వహించిన వేలంలో ఆ శునకం కేవలం రూ.1550కి అమ్ముడుపోయింది. దలైలామా టెంపుల్ పక్కన ఉన్న శివాలయంలో ఇవాళ ఆ వేలం జరిగింది. వేలంలో అయిదారుగురు పాల్గొన్నారు.
ప్రస్తుతం డోకో వయసు 13 ఏళ్లు. హమీపూర్ జిల్లాకు చెందిన అజయ్ పర్మార్ దాన్ని కొనుగోలు చేశాడు. నిజానికి ఇండియన్ ఆర్మీ వద్ద ఉన్న లాబ్రడార్ డోకోను 2010లో హిమాచల్ పోలీసులు 1.23 లక్షలకు కొనుగోలు చేశారు. పేలుడు పదార్ధాలను గుర్తించడంలో ఆర్మీ వద్ద ఆ శునకం శిక్షణ పొందింది. స్నిఫింగ్లో అది శిక్షణ తీసుకున్నది.
ఫిబ్రవరి ఏడో తేదీన డోకో సేవలు ముగిశాయి. ఆ జాగిలం సర్వీసు నుంచి రిటైర్ అయ్యింది. అయితే దానికి వినికిడి శక్తి తగ్గినట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. డోకో వేలాన్ని అడ్డుకునేందుకు ఓ ఎన్జీవో ప్రయత్నించింది. 12 ఏళ్లు దలైలామా సెక్యూర్టీలో ఉన్న ఆ జాగిలాన్ని ఎలా అమ్ముతున్నారని ఆ ఎన్జీవో ప్రశ్నించింది.