కోజికోడ్: కేరళలో కదులుతున్న రైలులోనే తోటి ప్రయాణికులకు నిప్పపెట్టిన నిందితుడు షారూఖ్ సైఫీ (Sharukh Saifi) కి కోజికోడ్ (Kozhikode) లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (Munsiff Magistrate Court) రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సైఫీ తీవ్ర గాయాలతో కోజికోడ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున మున్సిఫ్ మెజిస్ట్రేట్ జడ్జి నేరుగా ఆస్పత్రికి వెళ్లి, నిందితుడిని పరిశీలించి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు.
మున్సిఫ్ మెజిస్ట్రేజ్ జడ్జి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట కోజికోడ్ నగర పోలీస్ కమిషనర్ రాజ్పాల్ మీనా కూడా ఉన్నారు. కాగా, నిందితుడికి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుండటంతో పోలీసులు ఆస్పత్రిలోనే అతడిని తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. గత ఆదివారం రాత్రి రైల్లో తోటి ప్రయాణికులకు నిప్పుపెట్టి తప్పించుకు తిరుగున్న నిందితుడు సైఫీని సెంట్రల్ ఇంటెలిజెన్స్, మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు సంయుక్తంగా గాలించి మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని రత్నగిరి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు.
గత ఆదివారం రాత్రి అలప్పుజ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలులో నిందితుడు సైఫీ ఈ దారుణానికి ఒడిగట్టడాడు. రైలు కోజికోడ్ సిటీని దాటి కోరపుఝ రైల్వే బ్రిడ్జికి చేరుకోగానే తోటి ప్రయాణికులపై గుర్తు తెలియని ద్రవపదార్థం చల్లి, నిప్పుపెట్టి పరారయ్యాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు రైల్వే పోలీసులు తనిఖీ చేయగా కోజికోడ్లోని ఏల్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏడాది వయసున్న ఒక బాలుడు, ఒక మహిళ సహా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటికే మరో ఎనిమిది మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
కాగా, ప్రయాణికులకు నిప్పుపెట్టిన అనంతరం నిందితుడు షారూఖ్ సైఫీ తప్పించుకునేందుకు రైలులో నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అరెస్ట్ అనంతరం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.