కోల్కతా: దేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున జరుగుతుంటాయి. డ్రైవర్ల తీవ్ర అలసట, నిద్రలేమి కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ తీరును గమనించిన కోల్కతా ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కొత్త విధానం అవలంభిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం టీ వైపు మొగ్గు చూపారు. రాత్రి వేళ ప్రమాదాలను నివారించడానికి కోల్కతా ట్రాఫిక్ పోలీసులు వాహన డ్రైవర్లకు ‘గరమ్ చాయ్’ అందిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఒక ప్రమాదం నేపథ్యంలో ఈ కొత్త విధానానికి ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. మృతదేహాన్ని తీసుకెళ్తున్న ఒక లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న రాతి చిప్లతో కూడిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తొలుత అనుమానించారు. అయితే అతడు మద్యం సేవించలేదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో డ్రైవర్ నిద్ర మత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేశారు.
నిద్ర లేమి వల్ల కలిగే అలసట డ్రైవర్లకు పెద్ద శత్రువని కోల్కతా సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రివేళ రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం కొత్త విధానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అలసిపోయిన డ్రైవర్లను ఉత్తేజపరిచేందుకు ‘గరమ్ చాయ్’ అందిస్తున్నట్లు వెల్లడించారు. ‘పత్రాలను తనిఖీ చేయాల్సి ఉన్నందున డ్రైవర్లు తమ వాహనాలను ఆపాల్సి ఉంటుంది. అప్పుడు వారికి కొంత విరామం లభిస్తుంది. దీంతో పేపర్లను తనిఖీ చేస్తున్నప్పుడు డ్రైవర్లకు టీ అందించాలని నిర్ణయించాం. ఇది స్వాగతించాల్సిన అంశం మాత్రమే కాదు, డ్రైవర్లతోపాటు ఇతర వ్యక్తుల భద్రతకు కూడా చాలా ముఖ్యమైనది’ అని ఆ అధికారి అన్నారు.