న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన మూడో మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతం కావడంతోపాటు చరిత్ర సృష్టించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో మూన్ సౌత్ పోల్పై కాలుమోపిన తొలి దేశంగా భారత్ చరిత్రలోకి ఎక్కింది. ఈ నేపథ్యంలో సుమారు రూ.600 కోట్ల వ్యయంతో భారత్ చేపట్టిన మూన్ మిషన్కు సంబంధించిన అనేక అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.
కాగా, జూలై 14న మధ్యాహ్నం 2.30 గంటలకు లాంచ్ వెహికల్ మార్క్-III రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3ని నింగిలోకి ఇస్రో పంపింది. అతిపెద్ద బరువైన ఈ రాకెట్ ప్రధానంగా ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ అనే మూడు మాడ్యూళ్లను కలిగి ఉన్నది. రాకెట్ మొదటి దశ ఘన ఇంధనంతో, రెండవ దశ ద్రవ ఇంధనంతో, చివరి దశలో ద్రవ హైడ్రోజన్, ద్రవ ఆక్సిజన్తో నడిచే క్రయోజెనిక్ ఇంజిన్లున్నాయి.
మరోవైపు జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ సందర్భంగా ప్రొపల్షన్ మాడ్యూల్ను 1,696.4 కిలోల ఇంధనంతో నింపారు. ఇది భూ కక్ష్యలోకి చేరిన తర్వాత ఇస్రో ఐదు విన్యాసాలు చేపట్టింది. అనంతరం చంద్రయాన్-3 చంద్రుడి దిశగా ప్రయాణించినప్పుడు జూలై 15, ఆగస్ట్ 17 మధ్య మరో ఐదు విన్యాసాలను ఇస్రో నిర్వహించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్లోని ఇంధనం చాలా వరకు అయిపోయింది. దీంతో మిగిలిన ఇంధనంతో ప్రొపల్షన్ మాడ్యూల్ మూడు నుంచి ఆరు నెలల వరకు పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు.
కాగా, ఆగస్ట్ 5న చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి చేరుకున్నది. అనంతరం ల్యాండర్ను చంద్రుడి ఉపరితలం మీదకు పంపింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మాడ్యూల్లో సుమారు 150 కిలోలకుపైగా ఇంధనం మిగిలి ఉంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల మీడియాతో అన్నారు. తమ అంచనాలకు మించి మిగిలిన ఈ ఇంధనం వల్ల చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరిగే ప్రొపల్షన్ మాడ్యూల్ చాలా ఏండ్ల వరకు పని చేస్తుందని చెప్పారు.