ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం లక్నోలో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కిరణ్ గోసవి అనుమతి కోరినప్పటికీ.. ఆ ప్రతిపాదనను పోలీసులు అంగీకరించలేదు. మొత్తానికి కిరణ్ గోసవిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు పుణె పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా తెలిపారు.
2018లో చీటింగ్ కేసులో కిరణ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. 2019లో కిరణ్ గోసవిని పుణె పోలీసులు మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు. అయితే ఇటీవలే ఆర్యన్ ఖాన్తో కిరణ్ గోసవి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో చీటింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్గా ఉన్న గోసవిపై అక్టోబర్ 14న పుణె పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట కేపీజీ డ్రీమ్జ్ సొల్యూషన్స్ అనే సంస్థను గతంలో కిరణ్ గోసవి నిర్వహించాడు. అయితే మలేషియాలోని ప్రముఖ హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.3.09 లక్షలను వసూలు చేశాడు. ఆ తర్వాత అతనికి ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ సాక్షిగా ఉన్న కిరణ్ గోసవి.. తన అరెస్టు కంటే ముందు స్పందించారు. డ్రగ్స్ కేసులో సాక్ష్యంగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అబద్ధాలు చెప్తున్నారని కిరణ్ ఆరోపించాడు. అతని సీడీఆర్ విడుదల చేయాలని కిరణ్ డిమాండ్ చేశాడు. తన సీడీఆర్, చాట్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ప్రభాకర్ సెయిల్, ఆయన సోదరుడి సీడీఆర్ బయటకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నాడు కిరణ్. మహారాష్ట్రకు చెందిన ఒక మంత్రి లేదా ప్రతిపక్ష నాయకుడు ఒకరైనా తనకు మద్దతుగా నిలబడాలని కిరణ్ విజ్ఞప్తి చేశాడు.
ముంబై క్రూజ్ డ్రగ్స్ ఈ కేసులో సాక్ష్యంగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఓ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ప్రశ్నించేందుకు వచ్చిన ప్రైవేటు దర్యాప్తుదారుడు కిరణ్ గోసవి.. ఈ కేసుని పరిష్కరించేందుకు షారూఖ్ మేనేజర్తో రూ. 25 కోట్లు బేరం కుదుర్చుకోవాలని భావించినట్లు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపడుతున్న ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, కిరణ్ బాడీగార్డ్ ప్రభాకర్ మాట్లాడుతూ.. గోసవి రూ. 25 కోట్లకు కుదుర్చుకోవాలని, చివరకు రూ. 18 కోట్లుకు అంగీకరించాలని, అయితే వీటిలో రూ. 8 కోట్లు ఈ కేసు విచారణాధికారి సమీర్ వాఖండేకు చెల్లించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.