చెన్నై: బీజేపీ నేత కుష్బూ సుందర్(Khushbu Sundar) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తమిళనాడులో ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. తన సోషల్ మీడియా పేజీలో చేరి భాష గురించి ఇటీవల కుష్బూ కామెంట్ చేశారు. దాన్ని ఖండిస్తూ ఇవాళ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ వింగ్ నిరసన చేపట్టింది. చెన్నై శాంతోమ్ వద్ద ఆందోళనలో భాగంగా.. కుష్బూ ఫ్లెక్సీని చీపుర్లతో కొట్టారు. ఆందోళన చేస్తున్న ఎస్సీ వింగ్ సభ్యుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
#WATCH | Tamil Nadu Congress SC wing protest at Chennai Santhome near BJP leader Khushbu Sundar’s residence against her “Cheri comment” on her social media page last week. pic.twitter.com/GUAPdlVEQs
— ANI (@ANI) November 28, 2023
ఇటీవల నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కామెంట్ను ఖండిస్తూ బీజేపీ నేత కుష్బూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. ఖుష్బూ ఆ ఘటన పట్ల స్పందించడాన్ని డీఎంకే నేత శణ్ముగం చిన్నరాజ తప్పుపట్టారు. మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తుంటే బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు ఖుష్బూ కౌంటర్ ఇచ్చింది. మహిళల్ని కించపరిచే రీతిలో మాట్లాడడం తగదు అని, మీలాంటి చేరి భాష తనకు రాదు అని ఖుష్బూ తన కామెంట్లో పోస్టు చేశారు.
చేరి భాష గురించి కుష్బూ కామెంట్ చేయడాన్ని తమిళనాడు ఎస్సీలు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు దళిత ఉద్యమ ఎన్జీవో నీలమ్ ఫౌండేషన్ ఖుష్బూను తప్పుపట్టింది. చేరి అనే పదం దళిత మైనార్టీలను సూచిస్తుందని, ఆ పదాన్ని వాడడం అంటే దళితుల్ని అవమానించడమే అవుతుందని నీలమ్ ఫౌండేషన్ ఆరోపించింది.