న్యూఢిల్లీ, మే 16: ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కీలక పదవులు కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం మూడోసారి సిద్ధమైంది. లాటరల్ ఎంట్రీ పద్ధతిలో ఒప్పంద ప్రాతిపదికన వ్యవసాయం, పౌర విమానయానం, ఆహారం, విద్య, పట్టణాభివృద్ధి, ఔషధ, న్యాయ వ్యవహారాలు తదితర కీలక శాఖల్లో సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్లు, జాయింట్ సెక్రటరీల నియమకానికి ఈ నెల 20న నోటిఫికేషన్ వెలువడుతుందని కేంద్ర ప్రజా పనులు, శిక్షణ శాఖ(డీవోపీటీ) మంగళవారం వెల్లడించింది. ఖాళీలు, అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపింది. ఈ పోస్టులకు జూన్ 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ‘ప్రతిభ’ ఆధారంగా తుది జాబితాలో స్థానం సంపాదించిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. సాధారణంగా ఈ స్థాయి అధికారుల పోస్టులను ఆలిండియా గ్రూప్-ఏ సర్వీస్ అధికారులతో భర్తీ చేయాలి. కానీ, కేంద్రం ప్రైవేట్ వ్యక్తులతో నింపేలా చర్యలు చేపట్టింది.