RBI | న్యూఢిల్లీ, జూన్ 16: కార్పొరేట్లకు, ఎగవేతదారులకు మోదీ మార్కు మాఫీల పరంపరపై కీలక బ్యాంకింగ్ యూనియన్లు ధ్వజమెత్తాయి. రుణమాఫీ తతంగం బ్యాంకుల సమగ్రతకు చేటు కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని హెచ్చరించాయి. 6 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిలభారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఉమ్మడిగా విడుదల చేసిన ప్రకటనలో మోసగాళ్లకు దోచిపెట్టే విధానంపై తీవ్ర విమర్శలు సంధించాయి. ముఖ్యంగా ఆర్బీఐ తీరుపై మండిపడ్డాయి. రుణాల ఎగవేతదారులతో సెటిల్మెంట్లు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలు మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తాయని తేల్చిచెప్పాయి. కావాలని రుణాలు ఎగ్గొట్టేవారిని, మోసకారులను కాపు కాయటం బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతపై రాజీపడే విఘాతచర్యగా అభివర్ణిస్తూ యూనియన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి.
రుణాలు ఎగ్గొట్టిన వారికి క్లీన్చిట్ ఇవ్వడమేంటి?
బ్యాంకింగ్ రంగానికి చెందిన రెండు ప్రధాన యూనియన్లు జూన్ 13న విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆ ప్రకటనలో ఆర్బీఐని టార్గెట్ చేసుకొన్నప్పటికీ వాటి అసలైన లక్ష్యం సర్కారు విధానాలని పైకి తెలుస్తూనే ఉన్నది. బుద్ధిపూర్వకంగా, మోసకారితనంతో రుణాలు ఎగ్గొట్టేవారిని వదిలిపెట్టడమే కాకుండా పైనుంచి క్లీన్చిట్ ఇవ్వడమేమిటనేది యూనియన్ల ప్రశ్న. రాజీ సెటిల్మెంట్లు, సాంకేతిక మాఫీలపై ఫ్రేమ్వర్క్ పేరిట ఆర్బీఐ గతవారం జారీచేసిన మార్గదర్శకాలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నది. మోసకారుల రుణాలు మాఫీ చేసి సత్యవంతులని సర్టిఫికెట్ ఇచ్చే పద్ధతి వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పు ఏర్పడటమే కాకుండా అలాంటి ఎగవేతదారులను పకడ్బందీగా దారికి తెచ్చేందుకు పబ్లిక్రంగ బ్యాంకులు చేస్తున్న కృషి నిర్వీర్యమైపోతుందని రెండు యూనియన్లు సూటిగానే విమర్శలు చేశాయి.
‘బ్యాంకింగ్ రంగంలో కీలక భాగస్వాములుగా మేము ఎల్లప్పుడూ బుద్ధిపూర్వక ఎగవేతదారులపై కఠినచర్యలు తీసుకోవాలనే చెప్తున్నాం. మోసకారి, బుద్ధిపూర్వక అనే తరహా కిందకు వచ్చే ఎగవేతదారులపై రాజీ సెటిల్మెంట్లు అనుమతించటం న్యాయ, జవాబుదారీ సూత్రాలను అవమానించటమే అవుతుందని మేం బలంగా విశ్వసిస్తున్నాం. ఈ చర్య నిజాయితీలేని రుణగ్రహీతలకు లబ్ధి చేకూర్చి, మరోవైపు నిజాయితీపరులైన రుణగ్రహీతలకు నిస్పృహ కలిగించే సందేశాన్ని పంపుతుంది’ అని యూనియన్లు పేర్కొన్నాయి. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి రూపమ్రాయ్, ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం సంతకాలతో వెలువడిన ఆ ప్రకటనలో తప్పుడు సలహాలతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు బదులుగా బుద్ధిపూర్వక ఎగవేతదారులను వారి చర్యలకు బాధ్యులను చేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నిజాయితీపరులైన రుణగ్రహీతలు, డిపాజిటర్ల ప్రయోజనాలను, బ్యాంకింగ్ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఇది తప్పనిసరని నిర్దంద్వంగా స్పష్టం చేశారు.\
ఎగవేతదారుల భారం సామాన్యులు, సిబ్బందిపై..
బుద్ధిపూర్వక ఎగవేతదారులు బ్యాంకులు, మొత్తంగా ఆర్థికవ్యవస్థ సుస్థిరతను గణనీయంగా ప్రభావితం చేస్తారని యూనియన్లు హెచ్చరించాయి. రాజీ ఒప్పందం కింద రుణాలు సెటిల్ చేయటం ద్వారా ఆర్బీఐ వారి తప్పుడు చర్యలకు ఆమోదముద్ర వేసినట్టు అవుతుందని పేర్కొన్నాయి. అలాంటివారి తప్పుడు చర్యల భారాన్ని సామాన్య పౌరులు, కష్టపడి పనిచేసే బ్యాంకు ఉద్యోగులపై మోపడమేమిటని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్బీఐ కంటి తుడుపుగా క్రిమినల్ చర్యలను రద్దు చేయకుండానే మాఫీలు చేపట్టాలని సూచించటం గమనార్హం. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వ్యవహారంలో బ్యాంకులకు చెందిన ఆర్బీఐ నామినీ డైరెక్టర్లను, మేనేజింగ్ డైరెక్టర్లను, సీఎండీలను జవాబుదారీలుగా నిలబెట్టాలని పార్లమెంటు ఆర్థికవ్యవహారాల స్థాయీసంఘం 2016లో చేసిన సిఫారసును యూనియన్లు ఈ సందర్భంగా గుర్తు చేశాయి.
ఆ సంఘం సూచించినట్టుగా టాప్ ఎగవేతదారుల జాబితా ప్రచురించ లేదనే సంగతిని ఎత్తిచూపుతున్నాయి. బ్యాంకు బోర్డుల్లోని కీలక ఖాళీలను ఇప్పటికీ భర్తీ చేయకపోవటం వల్ల సత్వర రాజీ సెటిల్మెంట్లకు దారితీసినట్టు అవుతుంది కదా అని ఆర్బీఐని యూనియన్లు నిలదీశాయి. వసూలు కాని అప్పుల విషయంలో ఆర్బీఐ 2019లో జారీచేసిన ఫ్రేమ్వర్క్లో మోసాలు, దురుద్దేశాలు, బుద్ధిపూర్వక ఎగవేతలకు పాల్పడిన వారు పునర్వ్యవస్థీకరణకు అర్హత కలిగి ఉండరని చెప్పడాన్ని కూడా యూనియన్లు గుర్తు చేశాయి. కానీ ఇప్పుడు హటాత్తుగా ఫ్రేమ్వర్క్ను మార్చి బుద్ధిపూర్వక ఎగవేతదారులకు రాజీ సెటిల్మెంట్లు మంజూరు చేయాలని చెప్పడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని తెలిపాయి. బ్యాంకింగ్ రంగంపై ప్రజలు, డిపాజిటర్ల నమ్మకం సడలుతుందని వివరించాయి.
దోస్తుల కోసమే ఇదంతా: జైరాం రమేశ్
బ్యాంక్ యూనియన్ల ప్రకటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఎగవేతదారులకు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఆర్బీఐ సిద్ధం కావటంపై మండిపడ్డారు. కేవలం 12 మాసాల విరామం తర్వాత తిరిగి రుణాలు తీసుకునేందుకు వారికి ద్వారాలు తెరవడమేమిటని దుయ్యబట్టారు. ప్రధాని తన కార్పొరేట్ మిత్రుల కోసం వెంపర్లాడుతున్నారని, ఇందుకు బలమైన ఉదాహరణ అదానీ గ్రూపేనని జైరాం రమేశ్ అన్నారు. ‘హం అదానీకే హై కౌన్’ పేరిట కాంగ్రెస్ లేవనెత్తిన వంద ప్రశ్నలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.