తిరువనంతపురం: కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న తండ్రికి అతడి కుమార్తె తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చింది. దీంతో దేశంలో అతిపిన్న అవయవ దాతగా ఆమెగా కీర్తి పొందింది. కేరళలోని త్రిసూర్లో ఈ సంఘటన జరిగింది. 48 ఏళ్ల ప్రతీష్ ఒక కేఫ్ నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కిందట అతడి ఆరోగ్యం క్షీణించింది. అనారోగ్యానికి గురి కావడంతో పలు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ప్రతీష్ లివర్ దెబ్బతినడంతోపాటు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. దీంతో కాలేయం దాత కోసం అతడి కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది. అవి ఫలించకపోవడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు కుమార్తె దేవానంద ముందుకు వచ్చింది. 17 ఏళ్ల వయస్సున్న ఆమె 12వ తరగతి చదువుతున్నది.
కాగా, మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం మైనర్లు తమ అవయవాలను దానం చేయడానికి నిబంధనలు అనుమతించవు. అయితే ఇలాంటి ఒక కేసులో మైనర్ అవయవ దానానికి కోర్టు అనుమతించిన సంగతిని దేవానంద తెలుసుకుంది. దీంతో కేరళ హైకోర్టును ఆమె ఆశ్రయించింది. తన తండ్రి ఆరోగ్యం కోసం కుమార్తె చేస్తున్న ప్రయత్నాలను కోర్టు కూడా ప్రశంసించింది. ఆమె కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది.
మరోవైపు కోర్టు తీర్పుతో తన కాలేయం దానానికి యువతి దేవానంద సిద్ధమైంది. దీని కోసం తన ఆహారంలో చాలా మార్పులు చేసుకుంది. నిత్యం స్థానిక జిమ్కు వెళ్లి వ్యాయామాలు చేసింది. తన లివర్ మంచి స్థితిలో ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ నెల 9న జరిగిన సర్జరీ ద్వారా తండ్రి ప్రతీష్కు తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చింది.
కాగా, అలువాలోని రాజగిరి ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. తండ్రి ఆరోగ్యం కోసం కుమార్తె దేవానంద పడిన కష్టనష్టాలను కూడా ఆ హాస్పిటల్ గుర్తించింది. శస్త్రచికిత్స ఖర్చులను పూర్తిగా మాఫీ చేసింది. తండ్రికి కాలేయ దానం సర్జరీ తర్వాత దేవానంద ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉన్నది. అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యింది. దేశంలో అతి పిన్న అవయవ దాతగా ఆ యువతి కీర్తి గడించింది.