తిరువనంతపురం: ఒక కేసులో అనుమానితులను అరెస్ట్ చేసేందుకు కర్ణాటక పోలీసులు కేరళ చేరుకున్నారు. అయితే వారిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు (Kerala Police detains Karnataka cops). కేరళలోని కొచ్చీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్ణాటకలో ఇటీవల ఆన్లైన్ క్రిప్టోకరెన్సీ చీటింగ్ జరిగింది. ఈ మోసానికి సంబంధించిన కేసులోని అనుమానితులు కేరళలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 1న కర్ణాటకకు చెందిన సీఐతో సహా నలుగురు పోలీసులు కేరళలోని కొచ్చీకి చేరుకున్నారు. క్రిప్టోకరెన్సీ మోసం కేసుకు సంబంధించి అఖిల్, నిఖిల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని విడిచిపెట్టేందుకు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక నిందితుడు లక్ష, మరో నిందితుడు రూ.2.95 లక్షల డబ్బును కర్ణాటక పోలీసులకు ఇచ్చారు.
కాగా, కర్ణాటక పోలీసులు తమను బెదిరించి లంచంగా డబ్బులు తీసుకున్నట్లు ఒక నిందితుడు తన ప్రియురాలి ద్వారా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనంలో ఉన్న రూ.3.95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారి కొచ్చి చేరుకున్నారు. కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్న కేరళ పోలీసులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు.