తిరువనంతపురం: దేశంలో మంకీపాక్స్కు సంబంధించి తొలి మరణం నమోదైంది. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి అనారోగ్యం పాలై జూన్ 30న చనిపోయాడు. అతడికి మంకీపాక్స్ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. పరీక్షలో పాజిటివ్గా సోమవారం తేలింది. 22 ఏళ్ల వ్యక్తి జూలై 21న యూఏఈ నుంచి కేరళలోని త్రిస్సూర్కు తిరిగి వచ్చాడు. అయితే 26న అతడికి జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు 27న ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. 28న ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. చికిత్స పొందుతూ జూలై 30న మరణించాడు.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. కేరళకు వచ్చే ముందు జూలై 19న ఆ వ్యక్తికి యూఏఈలో మంకీపాక్స్ టెస్ట్ చేశారని తెలిపారు. అది పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యిందని చెప్పారు. జ్వరం, అసాధారణ వణుకు, శ్వాస సమస్యలు వంటి లక్షణాలతో అతడు ఆసుపత్రిలో చేరాడని వివరించారు. అయితే చేతులు లేదా శరీరంపై బొబ్బలు లేదా దద్దుర్లు లేవన్నారు. చికిత్స పొందుతూ శనివారం మరణించిన ఆ యువకుడి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.
మరోవైపు నిబంధనల ప్రకారం ఆ యువకుడిని దగ్గరగా కలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, వైద్య సిబ్బంది సహా 20 మందిని పరిశీలనలో ఉంచినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా, జూలై 14న దేశంలోనే తొలి మంకీపాక్స్ కేసు కేరళలోని కొల్లాం జిల్లాలో నమోదు కాగా, ఆ వ్యాధి వల్ల తొలి మరణం త్రిస్సూర్లో నమోదైంది.