న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తన అధికార నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ గూండాయిజానికి తెగబడితే వారు యువతకు ఎలాంటి సందేశం పంపుతున్నట్టని కాషాయ పార్టీ తీరును కేజ్రీవాల్ తప్పుపట్టారు.
కేజ్రీవాల్ ముఖ్యం కాదని, తాను దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెడతానని..అయితే దేశం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మనం దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉందని స్పష్టం చేశారు. మనం 75 ఏండ్ల పాటు కీచులాటలతోనే సమయం వృధా చేశామని అన్నారు.
కాగా కశ్మీర్ ఫైల్స్లో కశ్మీర్ పండిట్ల ఊచకోతకు సంబంధించి చూపిన అంశాలు అవాస్తవమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం కేజ్రీవాల్ నివాసం వద్ద చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కాషాయ పార్టీ కార్యకర్తలు కేజ్రీవాల్ నివాసం కిటికీలను ధ్వంసం చేశారు. కేజ్రీవాల్ నివాసంపై దాడిని ఆప్ నేతలు తీవ్రంగా ఖండించారు. మరోవైపు దాడికి పాల్పడిన పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.