న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై శుక్రవారం మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ అందించడంలో ఆయన విఫలమయ్యారని, ఇప్పుడు రేషన్ డోర్ డెలివరీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం రేషన్ మాఫియా నియంత్రణలో ఉన్నదని ఆరోపించారు. 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు పథకం అమలవుతున్నదని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. కేవలం ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, అస్సాం మాత్రమే ఇందులో చేరలేదని చెప్పారు. ఈ పథకాన్ని ఢిల్లీలో ఎందుకు అమలు చేయడం లేదు అన్నది కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.