KC Tyagi : ఇటీవల జేడీయూ (JDU) కు రాజీనామా చేయడం ద్వారా సంచలనం సృష్టించిన ఆ పార్టీ అగ్రనేత కేసీ త్యాగి (KC Tyagi).. ఆదివారం రాష్ట్రీయ లోక్దళ్ (RLD) లో చేరారు. ఆర్ఎల్డీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జయంత్ చౌదరి (Jayanth Choudhary) సమక్షంలో ఆయన ఆర్ఎల్డీలో చేరారు. ఈనెల 17న జేడీయూకు కేసీ త్యాగి రాజీనామా చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యక్రమానికి నిర్ణయించుకుంటానని చెప్పారు. తాజాగా ఆర్ఎల్డీలో చేరినట్టు ప్రకటించారు.
సమతా పార్టీ, జనతాదళ్ విలీనంతో 2003లో అక్టోబర్లో జేడీయూ ఏర్పాటైనప్పటి నుంచి ఆ పార్టీలో త్యాగి పనిచేస్తున్నారు. పార్టీ ప్రతినిధి, రాజకీయ సలహాదారు సహా పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ఘజియాబాద్కు చెదిన కిషన్ చాంద్ త్యాగి 1970 నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 1989లో ఉత్తరప్రదేశ్లోని హపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి వివిధ పార్టీల్లో కీలకమైన సంస్థాగత పదవులు నిర్వహించారు.
సమాజ్వాది జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత జేడీయూ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. 2013లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు వేర్వేరు సందర్భాల్లో జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2024లో వ్యక్తిగత కారణాలతో పార్టీ జాతీయ చీఫ్ స్పోక్స్పర్సన్ పదవి నుంచి వైదొలిగారు. జేడీయూతో చిరకాల సంబంధాలు కొనసాగించినప్పటికీ ఇటీవల ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు కారణాలను ఆయన చెప్పలేదు. ఆయన చర్యపై రాజకీయ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.