న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సందర్భంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. (Kashmir Terror Attack) అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. 26 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
కాగా, అమెరికా అగ్ర నేత భారత్ను సందర్శించిన సందర్భంగా ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడటం ఇది రెండోసారి. 2000 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా మార్చి 20న అనంత్నాగ్ జిల్లాలోని చిట్టిసింగ్పోరా అనే మారుమూల గ్రామాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. రాత్రి 7.20 గంటల సమయంలో ఇండియన్ ఆర్మీ యూనిఫారం ధరించిన టెర్రరిస్టులు సిక్కులు ప్రధానంగా నివసించే ఈ గ్రామంలోకి ప్రవేశించారు. ఆపిల్ తోటలు, పొలాల్లో నుంచి నిశ్శబ్దంగా చేరుకున్నారు.
మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు కొవ్వొత్తులు, లాంతర్లు వెలిగించారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత తొలి పర్యటన గురించిన వార్తలను రేడియోలో వింటున్నారు. కొందరు స్థానిక గురుద్వారాల్లో సాయంత్రం ప్రార్థనల తర్వాత తమ ఇళ్లకు చేరుకున్నారు.
కాగా, సిక్కు ప్రజలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. గుంపులుగా విడిపోయి ప్రార్థనా స్థలాలు, షాపులు, ఇళ్ల వద్ద ఉన్న సిక్కు పురుషులను చుట్టుముట్టారు. 37 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఒకచోట చేర్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. 35 మంది సిక్కులు అక్కడికక్కడే మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. జమ్ముకశ్మీర్లో ఏళ్లుగా కొనసాగుతున్న ఉగ్ర దాడుల్లో ప్రత్యేకంగా సిక్కు వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి.