బెంగళూరు, మే 31: అసహజ లైంగిక చర్యకు ఒప్పుకోవాలని భార్యపై ఒత్తిడి తెచ్చిన ఓ వ్యక్తిపై నమోదైన కేసును కొట్టేయాలన్న విజ్ఞప్తిని కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. అందుకు ఒప్పుకోనందుకు తన ఫొటోలను సోషల్మీడియాలో పోస్టు చేశాడని ఆ మహిళ పెట్టిన కేసుపై దర్యాప్తును కొనసాగించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఐఐటీ ముంబైలో 2015లో పీహెచ్డీ చేసే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, పెండ్లి చేసుకున్నారు. కొద్ది కాలానికే మహిళపై నిందితుడు అసహజ లైంగిక చర్యకు (ఆనల్ సెక్స్)ఒత్తిడి చేయడంతో ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. అలా ప్రవర్తించబోనని హామీ ఇచ్చి ఆమెను తీసుకెళ్లాడు. అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో 2016లో అతడిని వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ మహిళ తండ్రికి, ఇద్దరు స్నేహితులకు ఆమె అభ్యంతరకర ఫొటోలు పంపాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించింది.