బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పాలనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుకుంటున్నారని, ఆ విషయం స్పష్టంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు సుపరిపాలన అందించే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
బీజేపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని డికే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం దేశంలో ఒక అవినీతి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా ఉన్నారని, చాలామంది నేతలు ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నారని చెప్పారు.
ఇప్పటివరకు ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తూ 1300 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని డీకే శివకుమార్ వెల్లడించారు. వాళ్లంతా పోటీకి చాలా సీరియస్గా ఉన్నవాళ్లేనని చెప్పారు. అయితే, వాళ్లందరికీ తాము టికెట్లు ఇవ్వలేమని, కేవలం 224 మందికి మాత్రమే అవకాశం ఇవ్వగలమని అన్నారు. వచ్చిన దరఖాస్తుల్లోంచి ఆ 224 మందిని ఎంపిక చేస్తామని, ఈసారి ఎన్నికల్లో యువతకు, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వదలుచుకున్నామని డీకే తెలిపారు.