కర్నాటకలో సంచలనం సృష్టించిన విశ్రాంతి ఇంటలిజెన్స్ బ్యూరో అధికారి హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చే శారు. 82 ఏళ్ల విశ్రాంత ఇంటలిజెన్స్ బ్యూరో అధికారి ఆర్.ఎన్.కులకర్ణిని కారుతో ఢీకొట్టి చంపారు. ఈ కేసులో వీళ్లలో ప్రధాన నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదం కారణంగానే నిందితులు కులకర్ణిని హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడి కుటుంబానికి, కులకర్ణికి మధ్య కొన్ని రోజులుగా ఆస్తివివాదం నడుస్తోంది. ఈమధ్యే ఆస్తి వివాదం కేసులో కులకర్ణికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో, కక్ష పెంచుకున్న నిందితుడు ఆయనను హత్య చేయాలనుకున్నాడు.
నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టి
మొదట్లో ఐబీ ఆఫీసర్ చనిపోవడానికి కారణమైన వాళ్లపై వీవీపురం ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. కానీ, సీసీ టీవీ పుటేజీ పరిశీలించగా, నిందితులు ముందస్తు ప్రణాళికలో భాగంగానే కులకర్ణిని కారుతో ఢీ కొట్టారని తెలిసింది. అందుకోసం నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఉపయోగించారు నిందితులు. దాంతో, అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కులకర్ణి నవంబర్ 4వ తేదీన సాయంత్రం మైసూర్ యూనివర్సిటీ క్యాంపస్లో వాకింగ్కి వెళ్లారు. ఆయన వాకింగ్ చేస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన నెంబర్ప్లేట్ లేని ఒక కారు ఢీ కొట్టింది. దాంతో, ఆయన అక్కడికక్కడే చనిపోయారు.