బెంగళూరు : కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో చాలా మందిని అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటకలో కొవిడ్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ ( క్షయ వ్యాధి ) లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో మిగతా వారిని కూడా అధికారులు అప్రమత్తం చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఏ మాత్రం క్షయ వ్యాధి లక్షణాలున్న తక్షణమే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే కర్ణాటకలో టీబీ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కొవిడ్ రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పరీక్షిస్తున్నారు.
డోర్ టు డోర్ సర్వేలో భాగంగా ఆరోగ్య శాఖ అధికారులు.. కొవిడ్ నుంచి కోలుకున్న బాధిత వ్యక్తులకు చెందిన 6,02,887 ఇండ్లను సందర్శించారు. 5,37,333 మంది నుంచి నమూనాలను సేకరించగా, 24,598 మందిలో టీబీ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం 104 మంది టీబీ బారిన పడ్డట్టు తేలింది. ఇక కొవిడ్ బాధిత వ్యక్తుల కుటుంబ సభ్యులను పరీక్షించగా, 8,523 మందిలో లక్షణాలను గుర్తించారు. వీరిలో 51 మంది టీబీ నిర్ధారణ అయింది.