Kanpur Trader Death | కాన్పూర్ కేంద్రంగా వ్యాపార లావాదేవీలు జరుపుతున్న వ్యక్తి మనీష్ గుప్తా (38) మరణం కేసులో ఆరుగురు పోలీసు అధికారులు పరారీలో ఉన్నారని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదేశాల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోలీసులు గోరఖ్పూర్లో ఓ హోటల్పై దాడి జరిపిన టైంలో అక్కడ ఉన్న ప్రాపర్టీ డీలర్ మనీశ్ గుప్తా మృతి చెందారు.
దీనిపై ఆధారాలు సేకరించిన పోలీసులు ఆరుగురు అధికారులపై హత్య కేసు నమోదు చేయడంతోపాటు వారిని సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశామని గోరఖ్పూర్ సీనియర్ ఎస్పీ (ఎస్సెస్పీ) విపిన్ టాడా మీడియాకు చెప్పారు. మృతుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరించడానికి కాన్ఫూర్కు ఓ పోలీస్ బృందం వెళ్లిందని, ఆ తర్వాతే కేసు దర్యాప్తు పూర్తవుతుందన్నారు.
గోరఖ్పూర్లోని ఓ హోటల్లో ఒక వ్యక్తి ఇద్దరు స్నేహితులతో కలిసి అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నాడని తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. వారి ఐడెంటినీ చెక్ చేసేందుకు సోమవారం రాత్రి ఆ హోటల్కు వెళ్లామన్నారు. ఇంతకుముందు ఇదే పోలీసులు సదరు మనీష్ గుప్తా తాగి ఉన్నాడని, నేలపై పడిపోవడంతో తలకు గాయమైందని వాదించారు. ఆయన్ను బీఆర్డీ మెడికల్ కళాశాల దవాఖానకు తరలించామని, చికిత్స పొందుతూ మరణించాడని పేర్కొన్నారు.
కానీ మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు కొట్టడం వల్లే మనీశ్ గుప్తా మృతి చెందాడని ఆరోపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. ఎంతటి వారైనా చర్య తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన అంతా మోసం అన్నారు.