న్యూఢిల్లీ : సత్వర న్యాయం అందించే ప్రక్రియ అందుబాటులో ఉండాలని తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అన్నారు. ఏ న్యాయ వ్యవస్ధైనా స్పష్టత, నిలకడతో సాగాలని ఆయన స్పష్టం చేశారు. కుదురులేని అభిప్రాయాలు న్యాయవ్యవస్ధ గమనానికి అవరోధాలని అన్నారు.
పెండింగ్ కేసులు, అంశాలను సత్వరమే, దీటుగా పరిష్కరించాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అర్ధం చేసుకుని చట్టాల అమలు సాఫీగా సాగేలా చూడటం సర్వోన్నత న్యాయస్ధానం బాధ్యతని స్పష్టం చేశారు. రాజ్యాంగంతో ముడిపడిన అంశాల సత్వర పరిష్కారానికి రాజ్యాంగ ధర్మాసనాలను సత్వరమే ఏర్పాటు చేయాలని అన్నారు. తీర్పులు, న్యాయమూర్తులపై విమర్శలకు ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఓ న్యాయమూర్తి వ్యక్తపరిచిన అభిప్రాయం, తీసుకున్న వైఖరిలో పొరపాటు ఉంటే విమర్శించవచ్చని, అయితే ఇవి న్యాయవ్యవస్ధ దిద్దుబాటు చేసుకునేలా ఉండాలని అన్నారు. విమర్శ ఏ ప్రజాస్వామ్య వ్యవస్ధలోనూ ఆరోగ్యకరమైన సంకేతమని, అయితే విమర్శలకు ఓ హద్దు ఉండాలని చెప్పారు. కొలీజియం వ్యవస్ధను సమర్ధించిన జస్టిస్ యూయూ లలిత్ నియామకాల్లో దాని పాత్రను ప్రశంసించారు.