న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ లాగానే తనపై నమోదైన కల్పిత కేసులో బాధితుడ్ని అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ఆమెతో గంటకుపైగా చర్చించారు. అనంతరం మీడియాతో హేమంత్ సోరెన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన రెండు సీట్లలో అభ్యర్థులను పరస్పర అవగాహనతో ప్రకటిస్తామని అన్నారు.
కాగా, తనపై నమోదైన బొగ్గు కుంభకోణం కేసును సీఎం హేమంత్ సోరెన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కల్పిత కేసులో ఆర్యన్ ఖాన్ బాధితుడైన మాదిరిగా, తనపై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసిందన్నారు. తనపై ఈడీ కేసు కూడా ఇలాంటిదేనని తెలిపారు. ఈ ఆరోపణల్లో ఏం గుర్తించారు లేదా కేసు పురోగతిపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదన్నారు.
అలాగే ఉపాధి హామీ నిధుల వ్యవహారంపై జార్ఖండ్లోని రెండు రాష్ట్రాల్లో ఈడీ జరుపుతున్న దర్యాప్తుపైనా హేమంత్ సోరెన్ మాట్లాడారు. ఆ ప్రాంతాలను సందర్శించకుండా, సంబంధిత అధికారులను ప్రశ్నించకుండా ఈడీ దీనిపై ఎలా కేసు నమోదు చేసిందో తనకు అర్థం కావడం లేదన్నారు. ‘కేసును లోతుగా దర్యాప్తు చేయడం వారికి అవసరం లేదు. తమ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు’ అని విమర్శించారు. మొహెంజొదారోలో తవ్వకాల మాదిరిగానే దేవాలయాలు, మసీదుల తవ్వకాలపై బీజేపీ ఆసక్తి చూపుతుందని సోరెన్ మండిపడ్డారు. ‘ఈ కేసు 14 ఏళ్ల నాటిది. వారు 500 ఏళ్ల నాటి కేసులపై ఆసక్తి చూపుతున్నారు’ అని దుయ్యబట్టారు.