జోషీమఠ్, జనవరి 8: జోషీమఠ్ కుంగిపోయే, కొండ చరియలు విరిగిపడే ప్రాంతంగా అధికారులు గుర్తించారు. పట్టణంలో మొత్తంగా దాదాపు 4,500 భవనాలు ఉండగా ఇప్పటివరకు 610 భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు 60 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 90 కుటుంబాలను అత్యవసరంగా తరలించాల్సి ఉన్నది. వీరి కోసం స్థానికంగా ఉన్న హోటళ్లు, గురుద్వారా, రెండు కాలేజీల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు. పగుళ్లు ఏర్పడిన ఇండ్లలో నివసిస్తున్న వారు వాటిని వదిలేసి వేరే ఇండ్లలో అద్దెకు ఉండాలని, ఇందుకు గాను 6 నెలల పాటు నెలకు రూ.4,000 చొప్పున అద్దె చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
బలహీనమైన పునాదుల వల్లే..
బలహీనమైన పునాదాలపై విచ్చలవిడిగా చేపడుతున్న నిర్మాణాలే జోషీమఠ్ దుస్థితికి కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంతేకాదు, జోషీమఠ్తో పాటు హిమాలయాల చెంతనే ఉన్న నైనిటాల్, ఉత్తరకాశీ, చంపావట్ వంటి ప్రాంతాలకూ ఈ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జోషీమఠ్లానే నైనిటల్లోనూ టూరిజం ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీదనే చాలా వరకు నైనిటాల్ విస్తరించి ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరకాశీ, చంపావట్ కూడా బలహీనమైన భూమి పునాదుల మీద నిర్మితమయ్యాయి. ఇక్కడ కూడా జనాభా, నిర్మాణాలు పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాలకు ఉన్న ముప్పు గురించి అనేకసార్లు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా పట్టించుకోలేదని కుమౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బహదుర్ సింగ్ కొట్లియా అంటున్నారు.
పీఎంవో ఉన్నతస్థాయి సమీక్ష
ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన జోషీమఠ్పై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. జోషిమఠ్ ప్రజల భద్రతకు సంబంధించి వెంటనే, దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఇందులో నిర్ణయం జరిగింది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితులు తెలుసుకొన్నారు. జోషిమఠ్కు ఇప్పటికే ఒక ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. జోషీమఠ్ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరిశీలించారు.
పరిశోధన సంస్థల అధ్యయనం
జోషీమఠ్లో పరిస్థితిని అధ్యయనం చేయాల్సిందిగా హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ), డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ఎస్)ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరింది. శాటిలైట్ చిత్రాల ద్వారా అధ్యయనం జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ఇప్పటికే ఐఐటీ రూర్కీ, వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థలు కూడా జోషీమఠ్ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశాయి. త్వరలోనే ఈ సంస్థలు నివేదిక ఇవ్వనున్నాయి.