రాంచీ, డిసెంబర్ 2: కేంద్రం తీసుకొచ్చిన కొత్త అటవీ సంరక్షణ నిబంధనలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు స్థానిక గ్రామ సభ అధికారాలకు కత్తెర వేసేలా ఉన్నాయని, ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాసి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆదివాసీలు, అటవీ జాతుల హక్కులు కాపాడేలా ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్-2022లో మార్పులు చేయాలని విన్నవించారు. అడవి బిడ్డలకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కొత్త అటవీ నిబంధన ఇదీ..
గతంలో అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించేందుకు షెడ్యూల్ ప్రాంతంలోని గ్రామ సభ ఆమోదం ఉండాలి. కానీ, కొత్త నిబంధనల్లో దాన్ని ఎత్తేశారు. సింగిల్ విండో విధానం ద్వారా కేంద్ర క్యాబినెట్ ఆధ్వర్యంలో వేసిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ అనుమతి ఇస్తే చాలు.. అటవీ భూమిని బదలాయించొచ్చు. ఇది ఆదివాసీల హక్కులను కాలరాయటమేనని గిరిజన సంఘాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.