జైపూర్: రాజస్థాన్లోని కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు ఐదు నెలల కిందట మాయమయ్యాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతకసాగారు. చివరకు కేరళలో ఉన్నట్లు గుర్తించి కాపాడారు. (Missing JEE Aspirant Rescued ) బీహార్కు చెందిన 17 ఏళ్ల యువకుడు రాజస్థాన్లోని కోటాలో జేఈఈ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. విజ్ఞాన్ నగర్ ప్రాంతంలోని హాస్టల్లో నివసిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 5న హాస్టల్ నుంచి మాయమయ్యాడు. వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడి తండ్రి నవంబర్ 9న కోటా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, యువకుడి మిస్సింగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గత ఐదు నెలలుగా వెతుకుతున్నారు. ఆ విద్యార్థి మొబైల్ నంబర్, సోషల్ మీడియా ఖాతాలను మార్చడంతో అతడి ఉనికిని గుర్తించలేకపోయారు. అయితే ఆ యువకుడు కేరళలో ఉన్నట్లు కోటా పోలీసులకు కీలక సమాచారం అందింది. దీంతో మార్చి 8న ఆ రాష్ట్రానికి చేరుకున్నారు.
మరోవైపు విస్తృతంగా వెతకగా ఈ నెల 14న తిరువనంతపురం శివగిరి ప్రాంతంలోని బీచ్ వద్ద ఉన్న ఆ యువకుడ్ని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా జీవితంలో స్థిరపడాలని తనకు ఉందని, అందుకే కోటా నుంచి పారిపోయినట్లు అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపర్చిన తర్వాత తల్లిదండ్రులకు అతడ్ని అప్పగించారు.