న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) నూతన అధ్యక్షుడిగా దివంగత అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎల్డీ ఒక ప్రకటనలో తెలియజేసింది. చౌదరి చరణ్ సింగ్, చౌదరి అజిత్ సింగ్ సహా పలువురు అనుభవజ్ఞులతో జయంత్ చౌదరి పనిచేశారని, సంక్షోభ సమయంలో పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేశారని పార్టీ తన ప్రకటనలో పేర్కొన్నది.
అనంతరం జయంత్ చౌదరి మాట్లాడుతూ.. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఆందోళనలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రైతులతో కేంద్ర ప్రభుత్వం సత్వరం చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. దాంతో ఆయన తనయుడు ఆ పదవిని చేపట్టారు.