జంషెడ్పూర్ : కరోనా మహమ్మారితో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనివార్యంగా మారగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయలేని పలువురు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు మిస్సవుతున్నారు. జంషెడ్పూర్కు చెందిన 11 ఏండ్ల తులసికుమారి సైతం స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంది. లాక్డౌన్ సమయంలో కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు బాలిక జంషెడ్పూర్లో రోడ్డు పక్కన మామిడి పండ్లు విక్రయించేది.
మామిడి పండ్ల అమ్మకంతో వచ్చిన సొమ్మును ఆన్లైన్ స్టడీ కోసం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆదా చేస్తోంది. తులసి దయనీయ గాధను తెలుసుకున్న ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఆమె నుంచి డజను మామిడి పండ్లను ఒక్కో పండుకు రూ పది వేలు వెచ్చించి ఏకంగా రూ 1.2 లక్షలకు కొనుగోలు చేసి ఆమెకు బాసటగా నిలిచాడు. ముంబై వ్యాపారి, వ్యాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్ ఎండీ అమేయ హెటె తులసి తండ్రి శ్రీమల్ కుమార్ ఖాతాలో బుధవారం ఈ మొత్తాన్ని జమ చేశారు.
తులసి పట్టుదలకు ముగ్ధుడినయ్యానని, తన స్థితికి ఆమె ఎవరినీ నిందించకుండా, సాయం అడగకుండా కష్టపడటం అభినందనీయమని బాలికను అమేయ ప్రశంసించారు. ఆమెకు విరాళంగా కాకుండా ఆమె విక్రయించే మామిడి పండ్లను కొనుగోలు చేశామని చెప్పారు. ఇది తులసిని ప్రోత్సహించడమే కాదు పని పట్ల గౌరవాన్ని పెంచే ప్రయత్నమని అన్నారు. తులిసి అందరికీ ఓ మార్గదర్శిగా నిలిచిందని అన్నారు. మామిడి పండ్లు అమ్మగా వచ్చిన మొత్తంతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశానని ఇక తాను ఆన్లైన్ క్లాసులకు హాజరవుతానని తులసి తెలిపింది.