శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పును వెలువరిస్తున్నది. ఈనేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. పలువురు నేతలను గృహనిర్బంధం (House arrest) చేసింది. వారిలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) కూడా ఉన్నారు. ఈమేరకు పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పును వెళ్లడించడానికి ముందే.. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇంటికి పోలీసులు తాలు వేశారని, ఆమెను గృహ నిర్భందంలో ఉంచడం చట్ట వ్యతిరేకమని తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) కొట్టిపారేశారు. తమ ప్రభుత్వం ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదని స్పష్టంచేశారు. అది పూర్తిగా నిరాధారమైనదని వెల్లడించారు. రాజకీయ కారణాలతో ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదని, గృహ నిర్బంధంలో ఉంచలేదని తెలిపారు. ఇది కేవలం పుకార్లను వ్యాప్తి చేయడానికే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.
కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారని, వారిని జర్నలిస్టులు కలవడానికి కూడా అనుమతించడం లేదని స్థానిక మీడియా వెల్లడించింది.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుందా అన్న అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలుస్తున్నది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నది.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 16 రోజులపాటు సుదీర్ఘ వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులు.
విచారణ సందర్భంగా పిటిషనర్లను సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది. రాజ్యాంగ పరిషత్తు ఉనికిలో లేనప్పుడు, అధికరణం 370 రద్దుకు ఎవరు సిఫారసు చేయగలరని ప్రశ్నించింది. ఒక అధికరణ(ఆర్టికల్ 370) తాత్కాలికమైనదని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నప్పుడు.. జమ్ముకశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు 1957లో ముగిసిన తర్వాత ఆ అధికరణ ఎలా శాశ్వతం అవుతుందని పిటిషనర్లను అడిగింది.
అయితే 370 రద్దును వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. జమ్ముకశ్మీర్ రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు ముగిసిందని, ఈ నేపథ్యంలో ఆ అధికరణను రద్దు చేయలేరన్నారు. రాజ్యాంగ పరిషత్తు ముగియడంతో ఆర్టికల్ 370 శాశ్వత హోదా పొందిందని తెలిపారు. అయితే ఈ అధికరణను రద్దు చేయడంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం వాదించింది.