శ్రీనగర్: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి గల ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడం సహా పలు కీలక అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేయనున్నట్లు సమాచారం. రాజ్యాంగంలోని అధికరణ 370 ని రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్ నేతలతో కేంద్రం భేటీ కానుండటం గమనార్హం. కాగా, ప్రధానితో అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) సహా కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల నేతలు అంగీకారం తెలిపారు.
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా బుధవారం దిల్లీ బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్, మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.