బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే విషయంలో తాను ఎవరి పేరును సిఫారసు చేయబోనని.. కొద్దిసేపటి క్రితమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీఎస్ యెడియూరప్ప చెప్పారు. తన రాజీనామా కోసం ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం తానే స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగానని ఆయన వెల్లడించారు.
అధిష్ఠానం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించినా తాము అతని నాయకత్వంలో పనిచేస్తామని బీఎస్ యెడియూరప్ప చెప్పారు. తాను నూటికి నూరు శాతం కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తానని, అదేవిధంగా తన మద్దతుదారులు కూడా వచ్చే సీఎంకు 100 శాతం సహకారం అందిస్తారని యెడ్డీ స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానము, అసంతృప్తి అక్కెర లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని యెడ్డీ చెప్పారు.