India Vs Canada | వాషింగ్టన్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన కీలక సమచారాన్ని కెనడాకు అమెరికానే అందించిందని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తాజా కథనం వెల్లడించింది. ఆ తర్వాత కెనడా ఈ ఇంటెలిజెన్స్కు మరింత సమాచారాన్ని సేకరించిందని, తద్వారా నిజ్జర్ హత్యకు భారత్ కుట్ర పన్నిందనే ఆరోపణలు చేయడానికి దారితీసిందని పేర్కొన్నది. కెనడాలోని భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి కెనడా అధికారులు సమాచారం సేకరించినట్టు సంబంధిత అధికారులు చెప్పారని తెలిపింది. ఈ క్రమంలోనే దర్యాప్తునకు బారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారని పత్రిక తన కథనంలో పేర్కొన్నది. మరోవైపు నిజ్జర్ హత్యపై ‘ఫైవ్ ఐస్’ దేశాల మధ్య ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోబడిందని కెనడాలోని దౌత్యవేత్త ఒకరు శనివారం ధ్రువీకరించారు. ఇదే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై ఆరోపణలు చేసేలా ప్రోత్సహించిందని ఓ మీడియా కథనం పేర్కొన్నది.
కెనడాతోపాటు అమెరికా, యూకేల్లో ఉండే ఖలిస్థానీ ఉగ్రవాదులను గుర్తించాలని, తద్వారా వారు భారత్లోకి ప్రవేశించకుండా నియంత్రించేందుకు ఓసీఐ కార్డులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఆదేశించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కూడా సూచించిందని ఐఏఎన్ఎస్ పేర్కొన్నది. ఎన్ఐఏ శనివారం పంజాబ్లోని ఖలిస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్కు చెందిన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారతీయులకు కెనడా వీసాల జారీని కొనసాగిస్తున్నది.
కెనడా ప్రధాని జస్టిన్ టూడ్రోపై ఆ దేశానికి చెందిన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ ప్రీమియర్ డేవిడ్ ఇబీ మండిపడ్డారు. ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ట్రూడో భారత్పై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఓపెన్ సోర్స్ ఇంటర్నెట్ సమాచారం ఆధారంగానే ఆయనకు నిఘా వర్గాల సమాచారం వచ్చిందన్నారు. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని ఇండో-కెనడియన్ ఎంపీ, ట్రూడో సొంత పార్టీ అయిన లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య తప్పుబట్టారు. ట్రూడో వ్యాఖ్యల పరిణామాల నేపథ్యంలో దేశంలో హిందువుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.