ముంబై : బినామీ ఆస్తుల కేసులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ సన్నిహితులకు చెందిన రూ 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆదాయ పన్ను శాఖ బినామీ విభాగం మంగళవారం ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. మహారాష్ట్రలోని సతారాలో జరందేశ్వర్ చక్కెర ఫ్యాక్టరీ, ముంబైలోని పలు కార్యాలయాలు, ఢిల్లీలో ఓ ఫ్లాట్, గోవాలో ఓ రిసార్ట్ సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉన్న 27 భూములు సహా పలు ఆస్తులను ఐటీ అధికారులు అటాచ్ చేశారు.
ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ 1000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఆస్తులు ఏవీ అజిత్ పవార్ పేరుతో లేకపోవడం గమనార్హం. ఇక గత వారం అజిత్ పవార్ బంధువులకు చెందినవిగా భావిస్తున్న రెండు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్ధలపై ఐటీ అధికారులు చేపట్టిన దాడుల్లో రూ 184 కోట్ల లెక్కతేలని ఆదాయాన్ని గుర్తించారు.