హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సర్వం సన్నద్ధం చేసింది. చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ- డీ1) మరికొద్దిసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్ను ప్రయోగించనుంది. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్లో ఇదే మొదటిది కావడం గమనార్హం.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది.
‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్లో భాగంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఈ ‘ఆజాదీశాట్’ (AzadiSAT) అభివృద్ధిలో తెలంగాణ విద్యార్థులు పాలుపంచుకున్నారు. దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది చొప్పున మొత్తం 750 బాలికలు ఈ శాటిలైట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వారిలో మన రాష్ట్రంలోని 5 పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు ఉన్నారు.
సికింద్రాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల ఉన్నత పాఠశాల, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కాలేజీ, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సిద్దిపేట జిల్లా గుర్జకుంటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ వెంగళరావునగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులున్నారు. ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఈ విద్యార్థి బృందం.. ఇస్రో మార్గదర్శనంలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ) ‘ఆజాదీశాట్’ను రూపొందించింది.