కోల్కతా: ఉత్తరప్రదేశలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. అక్కడ ఉన్నది ‘రామ రాజ్యం’ కాదని, ‘హత్యా రాజ్యం’మని విమర్శించారు. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా 8 మంది మరణించడంపై సోమవారం ఆమె స్పందించారు. ఇది చాలా విచారకరమైన, దురదృష్టకరమైన సంఘటన అని తెలిపారు. ఈ సంఘటనను ఖండించడానికి తన దగ్గర మాటలు లేవని అన్నారు.
వారు (బీజేపీ ప్రభుత్వం) ప్రజాస్వామ్యాన్ని నమ్మరని, వారికి నిరంకుశత్వం మాత్రమే కావాలని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘ఇదేనా ‘రామరాజ్యం’? కాదు.. ఇది ‘కిల్లింగ్ రాజ్యం’ అని మండిపడ్డారు. బాధిత రైతు కుటుంబాలకు అండగా ఉంటామని, టీఎంసీ ఎంపీల బృందాన్ని లఖింపూర్ ఖేరీకి పంపుతామని చెప్పారు.