న్యూఢిల్లీ: పంజాబ్ నూతన డీజేపీగా వీరేశ్ కుమార్ భవ్రా నియమితులయ్యారు. భవ్రా నియామకానికి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ ఆమోదం తెలిపారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల నుంచి పంజాబ్ ప్రభుత్వం 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వీకే భవ్రాను ఎంపిక చేసింది. యూపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానల్లో భవ్రాతోపాటు దినకర్ గుప్తా, ప్రబోధ్ కుమార్ల పేర్లు కూడా ఉన్నాయి.
సుప్రీంకోర్టు 2018, జూలై 3న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక అధికారి డీజీపీగా నియమితులైన తర్వాత ఎలాంటి ఆరోపణలు లేకపోతే కనీసం రెండేండ్లపాటు ఆ పదవిలో కొనసాగే హక్కు ఉంది. ఆ ప్రకారం 2024 జనవరిలో భవ్రా పదవీకాలం ముగియనుంది. కాగా, ప్రస్తుత డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ ఆ పదవిని చేపట్టి నెల రోజులు కూడా కాలేదు. కానీ, ఇటీవల ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతాలోపానికి బాధ్యుడిని చేస్తూ ఆయనను పదవి నుంచి తొలగించారు.