అలీగఢ్: సాధారణంగా నాసికరం మొబైల్ ఫోన్లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్సంగ్ బ్రాండ్లో కూడా కొన్ని ఫోన్లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. జేబులోంచి పొగలు వచ్చేది గమనించిన ఓ వ్యక్తి.. ఆ జేబులో ఉన్న ఐఫోన్ను బయటికి తీస్తుండగానే అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో బాధితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అలీగఢ్కు చెందిన ప్రేమ్ రాజ్ సింగ్ (47) ఒక వ్యాపారి. ఆయన తన ప్యాంట్ జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం గమనించాడు. ఏం జరిగిందో చూద్దామని వెంటనే దాన్ని బయటికి తీస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ప్రేమ్ రాజ్ బొటన వేలికి, తొడకు స్వల్ప గాయాలయ్యాయి.
ఐఫోన్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీనిపై ప్రేమ్ రాజ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.