న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ త్వరలో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉన్నదని భారత పౌరవిమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ చెప్పారు. ఏవియేషన్ రెగ్యులేటరీ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నెల 30 వరకు షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి 23 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్పై నిషేధం అమల్లో ఉన్నది. గత అక్టోబర్ 31తో నిషేధం ముగియగా దాన్ని ఈ నెల 30వరకు పొడిగించారు.
నవంబర్ 30తో చివరి గడువు కూడా ముగియనుండటంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌరవిమానయాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలో అమెరికా, జర్మనీ, దుబాయ్, యూకే, కెనడా, ఫ్రాన్స్ దేశాలకు కరోనా నిబంధనలను అనుసరించి విమానాల రాకపోకలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్నది. కరోనా మొదటి వేవ్ తగ్గిన తర్వాత దుబాయ్, మాల్దీవులు, సీషెల్స్ సహా పలు దేశాలు భారత పర్యాటకుల కోసం ద్వారాలు తెరిచాయి. ఇంతలో సెకండ్ వేవ్ విజృంభించడంతో అన్ని దేశాలు భారత్ను రెడ్ లిస్టులో పెట్టాయి.
కాగా, ఇప్పుడు మళ్లీ చాలా దేశాలు అంతర్జాతీయ పర్యాటకుల కోసం తమ ద్వారాలు తెరిచాయి. అమెరికా ఈ నెల 8 నుంచి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉండి, వ్యాక్సినేషన్ పూర్తయిన వారు తమ దేశంలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నది. అదేబాటలో యునైటెడ్ కింగ్ డమ్, థాయ్లాండ్, బహ్రెయిన్, ఈజిప్టు, చిలీ, శ్రీలంక దేశాలు కూడా ఇంటర్నేషన్ ట్రావెలర్స్కు ద్వారాలు తెరువనున్నట్లు ప్రకటించాయి.