న్యూఢిల్లీ, జూలై 20: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనలు సోమవారం లోక్సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. దీంతో వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున సభలో వాయిదాల పర్వం కొనసాగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలోని నిరసనకారులు పార్లమెంట్ వైపు ర్యాలీ చేసేందుకు బారికేడ్లను ఛేదించుకునేందుకు ప్రయత్నించడంతో ఈ అంతరాయం ఏర్పడింది. అంతరాయాల కారణంగా సభ ఆరుసార్లు వాయిదా పడడంతో సాయంత్రం 3 గంటల ప్రాంతంలో లోక్సభను ముగించాల్సి వచ్చింది. నిరసనల మధ్య న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచే ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభలో నిరసనలు కొనసాగుతుండడంతో స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సూకియా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ సభ సజావుగా సాగకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగింది.
రాజ్యసభలోనూ నిరసనలు
నీట్ ప్రశ్న పత్రం లీకేజ్లో దోషులపై చర్యలు తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయడంతో సోమవారం రాజ్యసభ ఎటువంటి కార్యకలాపాలు సాగించకుండానే మరుసటి రోజుకు వాయిదా పడింది. సభ్యులు సహకరించాలని డిప్యుటీ చైర్మన్ హరివంశ్ పదేపదే విపక్ష సభ్యులను కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో సభ వాయిదాపడింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ విషయంపై ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ ఈ సమస్య లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు. విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారని, వారిపై లాఠీచార్జ్ జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వారిని అణచివేసి ఈ సమస్యను అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభను మధ్యాహ్నం వరకు చైర్మన్ వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన వెంటనే నిరసన తెలియచేస్తున్న విద్యార్థులపై పోలీసు చర్యకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.