లక్నో: కొత్తగా వేసిన రోడ్డును ఒక ఎమ్మెల్యే ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టగా అది పగలకపోగా ఏకంగా రోడ్డు పగులిచ్చింది. దీంతో దాని నాణ్యతపై ఆమె నోరెళ్లబెట్టారు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఈ ఘటన జరిగింది. సదర్ నియోజకవర్గంలో 7.5 కిలోమీటర్ల మేర రోడ్డును ఇరిగేషన్ శాఖ రూ.1.16 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరిని ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి అధికారులు పిలిచారు. శుక్రవారం సాయంత్రం ఆమె పూజలు చేసి రోడ్డుపై కొబ్బరికాయ కొట్టారు. అయితే టెంకాయ పగలకపోగా రోడ్డు పగులిచ్చింది.
దీంతో రోడ్డు నాణ్యతపై మహిళా ఎమ్మెల్యే సుచి చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. మూడు గంటలపాటు అక్కడే ఉంచి రోడ్డు మెటిరియల్ శాంపిల్స్ను సేకరించి నాణ్యత పరిశీలన కోసం పంపారు. నాసిరకంగా రోడ్డు నిర్మించిన ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు చేపడతామని చెప్పారు. దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు తెలిపారు.
మరోవైపు రోడ్డు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరుగలేదని బిజ్నోర్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వికాస్ అగర్వాల్ చెప్పారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు దర్యాప్తు జరుపాలని జిల్లా కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు.