న్యూఢిల్లీ: ముంబైలోని ఐనాక్స్ గ్రూపు(INOX Group) సైబర్ మోసానికి గురైంది. ఐనాక్స్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి .. కేవలం వాట్సాప్ ఆదేశాలను అనుసరిస్తూ, తన బాస్కు తెలియకుండానే సుమారు 10 కోట్లపైన ట్రాన్స్ఫర్ చేశాడు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న గిరీశ్ అమిన్ అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. కంపెనీలోని తన బాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్ధ జైన్ నుంచి వాట్సాప్లో ఆదేశాలు వస్తున్నట్లుగా భావించి .. 63 సార్లు కంపెనీ అకౌంట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులకు అమిన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే పేమెంట్లకు సంబంధించిన ఇన్వాయిస్లు కావాలని అమిన్ అడిగినప్పుడు అతని బాస్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. దీంతో అసలు కేసు బయటపడింది.ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
పోలీసులు కథనం ప్రకారం జూన్ 3వ తేదీన డిప్యూటీ జనరల్ మేనేజర్ అమిన్ వాట్సాప్కు ఓ మెసేజ్ వచ్చింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్ధ జైన్ మెసేజ్ చేస్తున్నట్లు ఆ మెసేజ్లో ఉన్నది. పర్సనల్ నెంబర్గా దీన్ని సేవ్ చేసుకోవాలని జైన్ ఆ మెసేజ్లో చెప్పాడు. ఎవరితోనూ ఈ విషయాన్ని షేర్ చేయవద్దు అన్నాడు. ఆ మెసేజ్ వచ్చిన వాట్సాప్ డీపీలో జైన్ ఫోటో ఉన్నది. అయితే తన బాసే తనతో కాంటాక్ట్లో ఉన్నట్లు అమిన్ భావించాడు. అకస్మాత్తుగా మెసేజ్ చేసి తాను అర్జెంట్ మీటింగ్కు వెళ్తున్నానని, తనకు ఫోన్ చేయవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్ డిటేల్స్ షేర్ చేశాడు. కంపెనీ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించాడు.
తొలి ట్రాన్స్ఫర్లో 46.5 లక్షలు బదిలీ చేశాడు అమిన్. జూన్ 3 నుంచి 15వ తేదీ వరకు బాస్ ఇస్తున్న ఆదేశాల ప్రకారం 63 సార్లు అమౌంట్ బదిలీ చేశాడు. సుమారు 10.4 కోట్ల వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడతను. అయితే అకౌంటింగ్ ప్రాసెస్ కోసం బదిలీలకు చెందిన ఇన్వాయిస్లు కావాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జైన్ను అమిన్ కోరాడు. కానీ డబ్బు ట్రాన్స్ఫర్ కోసం తానేమీ ఆదేశాలు ఇవ్వలేదని జైన్ తెలిపాడు. దీంతో అమిన్ మోసానికి గురైనట్లు గ్రహించాడు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో ముంబై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బ్యాంకు అకౌంట్లకు చెందిన సమాచారం ఢిల్లీ పోలీసులకు వెళ్లింది. అయితే జసోలాలోని ఐడీఎఫ్సీ బ్యాంక్లో 8 లక్షలు విత్డ్రా చేసుకునేందుకు ఇద్దరు వ్యక్తులు వెళ్లినట్లు తెలిసింది. పోలీసుల అక్కడకు చేరుకుని ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ కోసం తమ అకౌంట్లను ఇచ్చినట్లు ఆ ఇద్దరు అంగీకరించారు. ఒక్కొక్కరికి 30 వేలు ఇస్తామని సైబర్ మోసగాళ్లు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దర్యాప్తు చేపడుతున్న సమయంలో మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఫయాజ్ ఆలం, అమిత్లను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు అకౌంట్లు ఇస్తే రెండు శాతం కమీషన్ ఇస్తామని ఓ వ్యక్తి తనకు ఆఫర్ ఇచ్చినట్లు ఫయాజ్ తెలిపాడు.
ఇక ఇటీవల ఢిల్లీ పోలీసులు ఆపరేషన్ సైహాక్ చేపట్టారు. దీనిలో భాగంగా బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనుమానిత లావాదేవీలపై ఫోకస్ పెట్టాలన్నారు. విజిలెన్స్ అప్రమత్తం కావడం వల్ల ఇద్దరు నిందితులు దొరికారు. ఈ కేసులో ఇప్పటికే నలుగుర్ని అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్కు మాస్టర్మైండ్ ఎవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైం గ్యాంగ్ ఏదైనా ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నది.