న్యూఢిల్లీ: షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. జస్టిల్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. షీనా బోరా కేసులో ఇప్పటికే ఇంద్రాణి 6.5 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. ఈ కేసు సందర్భోచిత సాక్ష్యాధారాల ఆధారంగా ఉందని సుప్రీం పేర్కొంది.ఈ కేసులో 50 శాతం మంది సాక్ష్యులను విచారించినా.. ఇప్పట్లో ఈ కేసు విచారణ పూర్తి కాదు అని కోర్టు తెలిపింది. పీటర్ ముఖర్జియాపై విధించిన షరుతలతో ఇంద్రాణిపై విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. పీటర్ కుమారుడు రాహుల్ ముఖర్జియాతో షీనా బోరా లివిన్ రిలేషన్లో ఉన్న కారణంగా ఆమెను ఇంద్రాణి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2012లో ఈ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ కేసులో విచారణ చేపడుతన్న సీబీఐ కోర్టు ఇంద్రాణికి బెయిల్ ఇచ్చేందుకు పలుమార్లు నిరాకరించింది. అయితే షీనా బ్రతికి ఉందని, ఆమె కశ్మీర్లో ఉన్నట్లు గత ఏడాది సీబీఐకి ఇంద్రాణి లేఖ రాసిన విషయం తెలిసిందే.