భోపాల్: పోలీసులు మానవత్వం చాటారు. చెమటలు కార్చుతూ సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న ఒక వ్యక్తికి బైక్ కొని ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. ఇండోర్లోని విజయ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 22 ఏళ్ల జే హాల్డే జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. బైక్ లేకపోవడంతో తనకున్న సైకిల్పైనే ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాడు. విజయ్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తెహజీబ్ ఖాజీ రాత్రి వేళ పెట్రోలింగ్లో అతడ్ని చూశాడు. సైకిల్ తొక్కుతూ చెమటలు కార్చుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్న హాల్డే వివరాలను ఆయన ఆరా తీశారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల బైక్ కొనుగోలు చేయలేక సైకిల్పైనే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పాడు.
దీంతో మానవత్వంతో హాల్డేను ఆదుకునేందుకు విజయ్నగర్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ సిబ్బంది ముందుకు వచ్చాడు. వారంతా కలిసి రూ.32,000 కలెక్ట్ చేశారు. ఒక ఆటోమొబైల్ షో రూమ్లో అడ్వాన్స్, తొలి రుణ వాయిదా చెల్లించి ఒక బైక్ కొనుగోలు చేశారు. ఆ బైక్ను హాల్డేకు అందజేశారు. దీంతో అతడు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు. మిగతా ఈఎంఐలను తానే చెల్లిస్తానని అన్నాడు. గతంలో రాత్రి వేళ ఆరు నుంచి ఎనిమిది ఫుడ్ పార్సిల్స్ను డెలివరీ చేసేవాడినని, పోలీసులు బైక్ సమకూర్చడంతో 15-20 ఫుడ్ పార్సిల్స్ను డెలివరీ చేస్తున్నట్లు చెప్పాడు. అయితే మిగతా రుణ వాయిదాల చెల్లింపులో హాల్డే ఇబ్బంది పడితే తాము సహకరిస్తామని పోలీస్ అధికారి తెహజీబ్ ఖాజీ భరోసా ఇచ్చారు.