న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. అసలు ఇండిగో ఎందుకు సారీ చెప్పిందంటే.. శ్రాంఖ్లా శ్రీవాస్తవ (Shrankhla Srivastava) అనే ప్రయాణికురాలు ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించారు. విమానం దిగిన తర్వాత తన లగేజీ బ్యాగు (సూట్కేసు) చూస్తే పగిలిపోయి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘డియర్ ఇండిగో.. నా లాగేజీని ఇంత భద్రంగా చూసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పగుళ్లు పట్టిన సూట్కేసు ఫొటోను షేర్ చేశారు. విమాన సిబ్బంది తన లగేజీ బ్యాగ్ పట్ల వ్యవహరించిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇండిగో స్పందించింది.
‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. పొరపాటు ఎక్కడ జరిగిందో చెక్ చేసుకోవడానికి దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి. త్వరలో మళ్లీ మేం మీతో కనెక్ట్ అవుతాం’ అంటూ శ్రీవాస్తవాకు రిప్లే ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జరిగిన నష్టానికి పరిహారం కానీ, పరిష్కారం కానీ చూపిస్తామంటూ హామీ ఇచ్చింది.
Dear @IndiGo6E ,
Thank you for taking care of my luggage 🙂 pic.twitter.com/LdgSHjWA1J— Shrankhla Srivastava (@shrankhla3) March 23, 2024