న్యూఢిల్లీ: ఇండియాలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాగ్జిన్. రెండోది కోవీషీల్డ్. అయితే ఈ రెండూ రెండు డోసులు తీసుకోవాల్సిందే. కానీ ఒకవేళ మొదటి డోసు ఒక వ్యాక్సిన్ తీసుకుని.. ఆ తర్వాత రెండవ డోసు మరో కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుంది. వేరువేరు వ్యాక్సిన్లను మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అధ్యయనం చేపట్టనున్నది. మరో నెల రోజుల్లో దీనిపై ట్రయల్స్ను నిర్వహించనున్నారు. కేవలం రెండున్నర నెలల్లోనే వ్యాక్సిన్ మిక్సింగ్ అంశంలో ట్రయల్స్ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నమోదు అవుతున్న సైడ్ ఎఫెక్ట్స్ను పరిశీలిస్తున్న కేంద్రం.. త్వరలో కోవిన్ యాప్ ద్వారా మిక్సింగ్ కేసులను పరిశీలించనున్నది. జిల్లా ఆరోగ్య అధికారులు ఆ డేటాను సేకరించనున్నారు. ఇటీవల యూపీలోని ఓ గ్రామంలో 20 మందికి రెండవ డోసు వేరే వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దాంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ మిక్సింగ్ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పౌల్ ఇటీవల తెలిపారు. రెండు వేరువేరు డోసుల వ్యాక్సిన్లు తీసుకుంటే ఎంత వరకు సమర్థంగా పనిచేస్తాయో పరిశీలించాలన్నారు.
కోవీషీల్డ్ ఇక సింగిలే..
సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ టీకాలను కేవలం సింగిల్ డోసు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా స్టడీ చేయనున్నారు. కోవీషీల్డ్ టీకాలను సింగిల్ డోసు రూపంలో ఇవ్వడం వల్ల దేశ జనాభా మొత్తాన్ని త్వరగా వ్యాక్సినేట్ చేయవచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి తొలుత కోవీషీల్డ్ను కేవలం సింగిల్ డోసు టీకాగానే పరిగణించారు. సింగిల్ డోసు కోవీషీల్డ్తో సరిపోను రక్షణ ఏర్పడుతుందన్న అభిప్రాయాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయి. అస్ట్రాజెనికా ఫార్ములా తరహాలోనే జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ లైట్ కూడా సింగిల్ డోసు టీకాలను తయారు చేశాయి. అందుకే కోవీషీల్డ్ టీకా కూడా అలాగే పనిచేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.