న్యూఢిల్లీ: భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లోనే నమోదైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. గత గురువారం అంటే డిసెంబర్ 30న మహారాష్ట్రలో ఓ 52 ఏండ్ల ఒమిక్రాన్ బాధితుడు మరణించాడు. ఆ తర్వాత రోజే డిసెంబర్ 31న రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ సిటీలోని లక్ష్మీనారాయణ్ నగర్లో 73 ఏండ్ల వ్యక్తి ఒమిక్రాన్తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మహారాష్ట్ర మరణం తొలి ఒమిక్రాన్ మరణంగా, రాజస్థాన్ మరణం ఒమిక్రాన్ రెండో మరణంగా రికార్డయ్యాయి.
అయితే, మహారాష్ట్ర బాధితుడి మరణానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కాదన్న అనుమానంతో ఇతర పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతని మరణానికి ఒమిక్రాన్ కారణం కాదని తేలింది. ఇతర అనారోగ్య కారణాలవల్ల అతను చనిపోయినట్లు వెల్లడయ్యింది. దాంతో రాజస్థాన్లో నమోదైన రెండో మరణమే తొలి ఒమిక్రాన్ మరణంగా కేంద్రం స్పష్టంచేసింది. కాగా, మన దేశంలోకి ఒమిక్రాన్ నవంబర్ 24న ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి రోజూ క్రమం తప్పకుండా కేసుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 2,135కు చేరింది.