న్యూఢిల్లీ, జూలై 20: మోదీ సర్కార్ హయాంలో గడిచిన ఏడేండ్లలో దాదాపు 9.5 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కిందటేడాది అత్యధికంగా 1,63,370 మంది అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లిపోయారని కేంద్ర హోంశాఖనే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. పౌరులు తమ సొంత దేశాలను వదిలి లక్షలాదిగా విదేశాలకు వెళ్లిపోవడానికి గల కారణాలను గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ నివేదికలో వెల్లడించింది. వ్యాపార అవకాశాలు లేకపోవడం, పన్నులు తదితర ఆర్థికపరమైన ఆందోళనలు, క్రైమ్రేట్ ఎక్కువగా ఉండటం వంటివి ప్రధానంగా ఉండగా.. ఇంకా మెరుగైన ఆరోగ్య సేవలు, మహిళల రక్షణ, పిల్లల విద్య కోసం పాటు అణిచివేత ప్రభుత్వాలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నది.