Indian Wolf | తోడేళ్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఊళ వేయడం. అవి అరిస్తే సుదూర ప్రాంతాలకు వినబడుతుంటాయి. ఒకదానితో మరొకటి కమ్యూనికేషన్ కోసమే తోడేళ్లు ఊళబెట్టినప్పటికీ.. ఆ శబ్దం వినగానే మనం వణికిపోతుంటాం. కానీ మన దేశంలో ఉండే ప్రత్యేక జాతికి చెందిన తోడేళ్లు (Indian Wolf) తమ సహజ లక్షణాన్ని వదిలేస్తున్నాయి. ఊళ పెట్టడం మానేసి నిశ్శబ్ధంగా జీవనాన్ని గడిపేస్తున్నాయట. మహారాష్ట్రలో నిర్వహించిన ఓ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుతం తోడేళ్లు (Indian wolves ) అంతరించేపోయే దశలో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII ) 2022 లెక్కల ప్రకారం 3100 తోడేళ్లు మాత్రమే నివసించి ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం అత్యధికంగా మధ్యప్రదేశ్లో 772 తోడేళ్లు జీవిస్తున్నాయి. ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్లో 532, గుజరాత్లో 494, మహారాష్ట్రలో 396, ఛత్తీస్గఢ్లో 320 తోడేళ్లు మాత్రమే బతికి ఉన్నాయి. ఈ క్రమంలో వాటి జీవనక్రమంపై పుణెలోని భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీతో కలిసి డబ్యూఐఐ ఒక అధ్యయనం చేసింది. మహారాష్ట్రలోని తోడేళ్లపై చేసిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు తెలిశాయి. మారుతున్న పరిస్థితుల కారణంగా తోడేళ్ల వైఖరిలో చాలా మార్పులు వచ్చాయని తెలిసింది. మానవ నివాసిత ప్రాంతాలు అడవుల సమీపంలో దాకా వెళ్లడంతో తోడేళ్లు తమ సహజ లక్షణమైన ఊళ వేయడాన్ని మానేశాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌగత సాధుఖాన్ వెల్లడించారు.
సాధారణంగా తోడేళ్లు గుంపులుగా సంచరిస్తుంటాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ముందుగా ఒక గుంపు డెకాయ్ ఆపరేషన్ చేస్తాయి. మిగతావి తర్వాత వెంటపడతాయి. ఎలా అంటే.. జింకలు లేదా గొర్రెల వంటి గుంపు కనిపించినప్పుడు ముందుగా ఒక గుంపు వెళ్లి వాటిని నదిల ఏదా పొదలు ఉన్న చోటకు తరుముతాయి. అక్కడ మాటు వేసి ఉన్న మరో గుంపు వాటిపై దాడికి దిగుతాయి. ముఖ్యంగా పరుగెత్తలేని జీవాలను గుర్తించి.. వాటిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగుతాయి. ముఖ్యంగా ఇవి రాత్రి పూట వేట ప్రారంభించి.. తెల్లారేలోపు ముగిస్తాయి. ఈ క్రమంలోనే అవి కమ్యూనికేషన్ కోసం ఊళ(అరుపు)ను ఉపయోగిస్తుంటాయి. తోడేళ్లు ఎక్కువగా గడ్డిభూముల్లోనే నివసిస్తుంటాయి. కానీ మానవ జనాభా పెరుగుదలతో అక్రమ నివాసిత ప్రాంతాలు అటవీ ప్రాంతంలోని గడ్డి భూముల సమీపంలోకి చేరుతున్నాయి. పైగా రాత్రి పూట దీపాల వెలుగులు, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ శబ్దాలు పెరిగిపోతున్నాయి.
తోడేళ్ల వేటకు కూడా ఇది ఆటంకంగా మారింది. ఈ పరిణామం తోడేళ్ల ఉనికికే ప్రమాదంగా మారింది. జనావాసాలు పెరిగిపోవడంతో వేటగాళ్లకు సులువుగా చిక్కే ప్రమాదం ఉందనే భయంతో తమ జీవన విధానంలో మార్పులు చేసుకుంటున్నాయని ఇండిపెండెంట్ రీసెర్చర్ మహేశ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తోడేళ్లు ఊళ వేయడం మానేశాయని డబ్ల్యూఐఐ నివేదికలోనూ వెల్లడయ్యింది. అదే మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతంలో ఉండే తోడేళ్లు సాధారణంగానే జీవిస్తున్నట్లు అధ్యయనంలో తెలిసింది.